వైకాపా మాజీ ఎమ్మెల్యే బురద రాజకీయాలు

మండిపడ్డ స్థానిక ప్రజలు
విజయవాడ,సెప్టెంబర్‌5( జనం సాక్షి ) : ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైకాపా మాజీ ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులందరూ కలిసి ఆ నాయకుణ్ని బయటకు పంపేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు బుధవారం వరద బాధితులను పరామర్శించేందుకు కంచికచర్ల ఓసీ క్లబ్‌ వద్దకు వెళ్లారు. బాధితులకు సరిగా సాయం అందించడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ ఓ బాధితుడు వివరించబోగా, ఆ వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించారు. నాలుగు రోజులుగా కూటమి నాయకులు అన్ని విధాలుగా సహాయం అందిస్తుంటే.. ఇప్పుడు వచ్చి బురద రాజకీయాలు చేయడంపై బాధితులు మండిపడ్డారు. ’మొండితోక గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ అతణ్ని అక్కడి నుంచి పంపేశారు.