వ్యవసాయ సంస్కరణల వల్ల రైతులకు మరిన్ని హక్కులు

– మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,నవంబరు 29(జనంసాక్షి): వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయని, వారికి మరిన్ని హక్కులు కల్పించాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 71వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యయసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల భయాల్ని తొలగించే ప్రయత్నం చేశారు. యువత.. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన చదువులు చదువుతున్నవారు దగ్గరలోని గ్రామాలకు వెళ్లి ఆధునిక వ్యయసాయం, కొత్త వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. కాగా, గతంలో జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు.