వ్యాక్సిన్‌ ఇంకా రెండు సంవత్సరాలు పట్టొచ్చు

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

దిల్లీ,నవంబరు 8 (జనంసాక్షి): భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒక వేళ వచ్చినా సాధారణ ప్రజానీకానికి చేరువయ్యేందుకు ఏడాదికి పైగా సమయం పడుతుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఇండియా మార్కెట్‌లో వ్యాక్సిన్‌ అందరికీ లభించాలంటే 2022 దాటే అవకాశముందని ఆయన చెప్పారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉన్నందున మరింత సమయం పట్టొచ్చన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని విలేకరులు ప్రశ్నించగా.. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి అనుకూలించేలా శీతల పరిస్థితులను కల్పిస్తూ.. సిరంజీలు, సూదులను పెద్దమొత్తంలో అందుబాటులో ఉంచాల్సిన అవసరముందన్నారు.కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత దానికంటే ఎఫెక్టివ్‌గా పనిచేసే మరొక వ్యాక్సిన్‌ వస్తే.. దానిపై పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరముందని గులేరియా తెలిపారు. వైరస్‌ తీవ్రతను బట్టి ఎవరికి ఏ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రావాలన్నారు. అయితే వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ను పూర్తిగా నాశనం చేయలేమని గులేరియా స్పష్టం చేశారు. చిన్నారులపై వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఎప్పుడు మొదలు పెడతారన్న ప్రశ్నకు సమాధానంగా.. సాధారణంగా పెద్దలపైనే వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేస్తారని అన్నారు. కరోనా వైరస్‌ చిన్నారులపై అంతగా ప్రభావం చూపడం లేదని అందువల్ల దీనికి ప్రస్తుతం అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని అన్నారు. అయితే వీరిద్వారా మరొకరికి వైరస్‌ వ్యాపించే అవకాశమున్నందున కొన్ని రోజుల తర్వాతయినా ప్రయోగాలు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న రెమిడెసివిర్‌ వల్ల మరణాల సంఖ్య తగ్గిందని చెప్పలేమని, అయితే అంతకుమించిన ఔషధం అందుబాటులో లేనందువల్ల దానినే ఉపయోగించాల్సి వస్తోందని అన్నారు. ఈ ఔషధం తీసుకోకపోయినా చాలా మంది బాధితులకు నయమైందని గులేరియా గుర్తు చేశారు.