శబరిమల రివ్యూ పిటిషన్లను..  నవంబర్‌ 13న విచారణ


– విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం
కల్పిస్తూ గత నెల 28న సుప్రిం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్లను మంగళవారం కోర్టు కోర్టు స్వీకరించింది. నవంబర్‌ 13వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు వీటిపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అనుమతించరు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న ఐదుగురు జడ్జీల సుప్రీం రాజ్యంగ ధర్మాసనం ఈ నిబంధనను కొట్టివేస్తూ 4:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ నిబంధనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో శబరిమలలో మహిళల ప్రవేశంపై సంప్రదాయవాదులు తీవ్ర ఆందోళనకు దిగారు.
పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళల్ని అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సవిూక్షించాలని కోరుతూ పలు హిందూ సంస్థలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.  గత బుధవారం తెరచుకున్న ఆలయం, ఐదు రోజుల అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. తిరిగి నవంబరు 5 ఆలయం తెరవనున్నారు. మండల పూజల కోసం నవంబరు 16నుంచి డిసెంబరు చివరి వారం, తర్వాత రోజుల మినహా జనవరి 20 వరకు సన్నిధానం తెరిచే ఉంటుంది. కాగా నవంబర్‌ 16 నుంచి మళ్లీ శబరిమల తెరుస్తుండటంతో ఈనెల 13న సుప్రింకోర్టు వెలువడించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.