శశికళకు ఈసీ భారీ షాక్ ఇవ్వబోతోందా?

చెన్నై : అన్నా డీఎంకే (అమ్మ) పార్టీకి ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇవ్వబోతోందా? తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ తదితరుల ఇళ్ళలో సోదాలు చేసిన ఆదాయపు పన్నుశాఖ ఓ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాధాకృష్ణన్ నగర్‌లో ఈ నెల 12న ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దాదాపు రూ.89 కోట్లు చేతులు మారాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. నగదు రూపంలో రూ.5.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించినట్లు సమాచారం. తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఉప ఎన్నికలకు సంబంధించిన చెల్లింపుల గురించి ప్రస్తావన ఉన్నట్లు తెలియజేస్తోందని చెప్తున్నారు. ఈ నివేదికను పరిశీలించి ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయం ఆర్కే నగర్ ఉప ఎన్నికలను వాయిదా వేయడమే కావచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.