శాస్త్రవేత్త సర్‌ డేవిడ్‌ అటన్‌బరోకు ఇందిరా అవార్డు

అధికారికంగా ప్రకటించిన జ్యూరీ

న్యూఢిల్లీ,నవంబరు19(జనం సాక్షి): ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌, ప్రకృతి శాస్త్రవేత్త సర్‌ డేవిడ్‌ అటన్‌బరో.. ఈ ఏడాది ఇందిరా గాంధీ శాంతి బహుమతి గెలుచుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్టు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. భూగోళంలోని ప్రకృతి రహస్యాలను విశదీకరించిన గొప్ప శాస్త్రవేత్త సర్‌ అటన్‌బరో అని ట్రస్టు తన ప్రకటనలో పేర్కొన్నది. జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు అటన్‌బరో ఎంతో కృష్టి చేశారన్నది. ప్రకృతి సంపదపై ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఎక్కువ శాతం బీబీసీ కోసం పనిచేసిన అటన్‌బరో.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. అటన్‌బరో తీసిన డాక్యుమెంటరీలకు కూడా విశేష గుర్తింపు ఉన్నది. అంతరిస్తున్న, సజీవంగా ఉన్న అనేక జీవాలకు అటన్‌బరో పేరును పెట్టారు.