శివ్‌పాల్‌ యాదవ్‌కు జడ్‌ క్యాటగిరి భద్రతా!

– సీఎం యోగి సంచలన నిర్ణయం
– తప్పుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు
లక్నో, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : సమాజ్‌వాది సెక్యులర్‌ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్‌ యాదవ్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జడ్‌ ప్లస్‌ క్యాటగిరి భద్రతా కల్పించారు. శివ్‌పాల్‌ యాదవ్‌కు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్‌ బ్యూరో నివేదిక ఇచ్చిన నేపథ్యంలో యోగి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఖాళీ చేసిన బంగ్లాతో పాటు.. హై లెవల్‌ భద్రత కల్పించారు. ఇప్పటివరకూ యూపీలో ములాయం సింగ్‌, అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి వంటి ప్రతిపక్ష నేతలకు మాత్రమే జడ్‌ ప్లస్‌ క్యాటగిరి భద్రతా కల్పిస్తున్నారు. ఇప్పుడు
వీరి కోవలోకి శివ్‌పాల్‌ యాదవ్‌ చేరారు. ప్రతిపక్ష నేతకు అధికార బంగ్లాతో పాటు, జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతాను కల్పించడంతో ప్రతిపక్షాలు సీఎం యోగిపై నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో శివ్‌పాల్‌ని బీజేపీలో చేర్చుకోవడం కోసమే యోగి ప్రభుత్వం ఇలాంటి గిమిక్కులు ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ విషయం గురించి శివ్‌పాల్‌  స్పందిస్తూ.. నేను ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మంత్రిగా కూడా చేశానన్నారు. ఇంటిలిజెన్స్‌ బ్యూరో నాకు ముప్పు ఉందని ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ప్రభుత్వం నాకు ఈ బంగళాను కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం శివ్‌పాల్‌కు లాల్‌ బహదూర్‌ శాస్త్రీ మార్గ్‌లో ఉన్న బంగాళను కేటాయించారు. గతంలో ఈ బంగళాను మాయావతికి కేటాయించారు.