శ్రీ వరిసాగుపై చైతన్యం రావాలి

రైతులు అవగాహన పెంచుకోవాలి
గుంటూరు,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : శ్రీ వరిసాగు యాజమాన్య పద్ధతులపై  రైతులుఅవగాహన
పెంచుకోవాలని పలువురు వ్యవసాయ వేత్తలు తెలిపారు. శ్రీవరి సాగు నారు నాటడం, విత్తనాలు ఎద జల్లడం రెండు విధాలుగా చేసుకోవచ్చన్నారు. నీటి యాజమన్య పద్ధతులే ప్రధానం అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనం శ్రీ వరిసాగు విధానంగా వివరించారు. నత్రజని చాలా తక్కువ మోతాదులో వాడాలని, సేంద్రియ ఎరువులనే వినియోగించాలన్నారు. డెల్టా ప్రాంతంలో నీటి ఎద్దడి తక్కువగా ఉన్నందున, తక్కువ నీటిని వినియోగిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో శ్రీ వరిసాగు ద్వారా అధిక దిగుబడులు సాధించొచ్చన్నారు. ఈతరహాలో బళ్ళారిలో ఎకరాకు 66బస్తాల దిగుబడి సాధించగా, దుగ్గిరాల మండలం చిలువూరులో 48బస్తాలు, బుర్రిపాలెం రైతు 44బస్తాలు దిగుబడులు సాధించినట్లు వివరించారు. రైతు ప్రయోజనాలకు అనుగుణంగా నూతన వ్యవసాయ పద్ధతుల పట్ల అవగాహన కార్యక్రమాల ఏర్పాటు చేయడం పట్ల, రైతులు నిర్వాహకులను అభినందించారు. నీటి యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువుల వాడకం, వరినాటే సమయంలో మొక్కకు, మొక్కకు మధ్య నిర్దేశించిన దూరం అమలు చేయడం వంటి మెళకువలు పాటించడం ద్వారా శ్రీ వరిసాగులో అధిక దిగుబడులు సాధించొచ్చని వివరించారు. రైతు వ్యవసాయ ప్రయోజనాలకు అద్దంపడుతూ, శ్రీ వరిసాగుకు, ఎన్‌ఆర్‌ఐ పి-003-రవి రకం విత్తనం వినియోగించాలని, నేల చదునుగా ఉండాలన్నారు. పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వరి నాట్ల విషయంలో ఒకమొక్క నాటాలని, మొక్కల మధ్య నిర్దేశించిన దూరం పాటించాలన్నారు.