షర్మిలా పాదయాత్రను అడ్డుకుంటాం

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టే పాదయాత్రను అడ్డుకుంటామని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య అన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, దోపిడీలు, అవినీతి కారణంగా రాష్ట్రంతోపాటు యువత, విద్యార్థులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. దోపిడీ కుటుంబానికి ప్రతినిధిగా షర్మిల పాదయాత్ర చేయడం తగదని అన్నారు. వైయస్‌ హాయాంలో లక్షకోట్ల రూపాయలు కూడబెట్టారని, అనేకమంది పారిశ్రామిక వేత్తలు, ఐఎయస్‌ అధికారులు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. షర్మిల పాదయాత్ర ఇడుపులపాయ నుంచి కాకుండా హైదరాబాదులోని చంచల్‌గూడా నుంచి తీహార్‌ జైలు వరకు పాదయాత్ర జరిపితే బాగుంటుందని వ్యంగ్యంగా అన్నారు. బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వైయస్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలోని బయ్యారంలో కోట్ల రూపాయల విలువైన ఇనుపఖనిజ అక్రమానికి పాల్పడ్డారని, బినామీల పేర్లుతో ఇనుపఖనిజాన్ని స్వాహా చేశారని అన్నారు.