షెంజాన్‌ సందర్శించిన సీఎం కేసీఆర్‌

5

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం షెంజాన్‌ హైటెక్‌ ఇండస్టియ్రల్‌ పార్కును సందర్శించారు. చైనాలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి అయిన ఇండసియెల్‌ పార్కు విశేషాలు, అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. షెంజాన్‌లో పర్యటన అనంతరం కేసీఆర్‌ అక్కడి నుంచి హాంకాంగ్‌ పయనమవుతారు. కెసిఆర్‌ వెంట స్పీకర్‌ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్‌నుంచి షెన్‌జాన్‌ నగరానికి చేరుకున్నది. చైనా సిలికాన్‌ వ్యాలీగా పిలిచే ఈ నగరం అనేక ఐటీ, మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీలకు కేంద్రంగా ఉంది.  1979లో చైనా ఆర్థిక సంస్కరణలకు నడుం కట్టిన తర్వాత ఈ నగరాన్ని ప్రత్యేక ఆర్థిక జోన్‌గా తీర్చిదిద్దారు. అనతికాలంలోనే ఈ నగరం 30 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. డాలియన్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో ప్రారంభమైన సీఎం పర్యటన ఆరు రోజులుగా డాలియన్‌, బీజింగ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీలు, సంప్రదింపులతో బిజీబిజీగా కొనసాగింది. ఈ భేటీల ఫలితంగా పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఉత్సాహం చూపాయి. బీజింగ్‌ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రానికి ముఖ్యమంత్రి బృందం షెన్‌జాన్‌ చేరుకుంది. అంతకు ముందు సీఎం అధికారులు, అనధికారులతో కలిసి బీజింగ్‌లోని పర్యాటక ప్రాధాన్యం కలిగిన తియానన్మెన్‌ స్వేర్‌, గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాలను సందర్శించింది.