సంయమనం పాటించండి

– రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ మద్దతు
– ఇక బీజేపీ తలుపులు మూసుపోతాయి
– కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వెల్లడించిన సోనియా
న్యూఢిల్లీ, నవంబర్‌ 9(జనంసాక్షి): అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.. రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని పేర్కొన్నారు. లౌకిక విలువలు, రాజ్యాంగం అందించిన భిన్నత్వ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలని, శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షత జరిగిన వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు. తరతరాలుగా సమాజంలో పరస్పరం గౌరవించుకొనే మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరి విూదా ఉందని సుర్జేవాలా అన్నారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందా అని ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మందిరం నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అనుకూలమేనని వెల్లడించారు. సుప్రీం తీర్పు ఏ వ్యక్తులు, సంఘాలు, మతాలు, రాజకీయ పార్టీలకు ఘనత, అవమానం కాబోదని ఆయన పేర్కొన్నారు.
భారతీయులంతా సోదరభావంతో మెలగాలి:రాహుల్‌గాంధీ
అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై శనఇవారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారతీయులంతా సోదరభావంతో, పరస్పర ప్రేమ, విశ్వాసాలతో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్యపై సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. అయోధ్యపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కోర్టు తీర్పును గౌరవించి మనమంతా పరస్పరం సామరస్యంతో మెలగాలని, భారతీయులందరి మధ్య సోదరభావం, నమ్మకం, ప్రేమ వెల్లివిరియాల్సిన సమయం ఇది అని రాహుల్‌ పేర్కొన్నారు. దశాబ్దాల నాటి అయోధ్య భూ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. అయితే ముస్లింలు అయోధ్యలో మసీదు నిర్మించుకునేలా ప్రత్యామ్నాయ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని షరతు విధించింది.