సమన్వయంతోనే పఠాన్‌ కోట్‌ ఆపరేషన్‌

3
– ఆర్మీ చీఫ్‌

న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులను హతమార్చడానిక సైన్యం నిర్వహించన ఆపరేషన్‌లో ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ అన్నారు. బుధవారం దిల్లీలో విూడియాతో మాట్లాడిన దల్బీర్‌ సింగ్‌ పఠాన్‌కోట్‌ ఆపరేషన్‌లో వివిధ దళాల మధ్య సమన్వయం లేదని వచ్చిన ఆరోపణలను దల్బీర్‌ ఖండించారు. ఆపరేషన్‌లో వైమానికస్థావరంలోని అన్ని దళాలు పూర్తి సమన్వయంతో పనిచేశాయని స్పష్టంచేశారు. ఆపరేషన్‌ పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకోవాలనే అంశం పూర్తిగా ఆపరేషన్‌ నిర్వహిస్తున్న కమాండర్‌కే వదిలేయాలని దల్బీర్‌ అన్నారు. పఠాన్‌కోట్‌లో జరిగిన ఆపరేషన్‌ అంత సులువైంది కాదని.. భద్రతాసిబ్బంది మరణాల సంఖ్య తగ్గించడానికే సమయం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చిందని దల్బీర్‌ తెలిపారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జనవరి 2న జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు ఉగ్రవాదులు హతమవగా.. ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దళాల మధ్య సంపూర్ణ

సమన్వయంతోనే పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను తుద ముట్టించామన్నారు. ఆపరేషన్‌ మూడు రోజులు కొనసాగించడంపై వస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు. జవాన్ల భద్రతకు సంబంధించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. బిల్డింగ్‌లో దాక్కున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.