సరికొత్తగా తెలంగాణ రాష్ట్రగీతం

` జూన్‌2న దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరణ
` అందెశ్రీ రాసిన గీతంలో స్వల్ప మార్పులు
` ఓకే చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి
` సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన గీతాన్ని స్వల్ప మార్పులతో స్వరపరిచారు. తెలంగాణ అవతరణ జరిగి పదేళ్లు కావస్తున్నందున పదేళ్ల సంబరాల్లో భాగంగా జూన్‌ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్‌ ప్రభుత్వం కంపోజింగ్‌ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న.. ఇంతవరకు రాష్ట్రం గీతం లేకుండా పోయింది. గతంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం గీతంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని అమోదిస్తూ కేబినెట్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిరది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్‌ చేశారు. జూన్‌2న రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని చీఫ్‌ గెస్ట్‌గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిన్న నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ చేతుల విూదుగా తెలంగాణ గీతాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలాబాగుందని రేవంత్‌ కితాబిచ్చారు. అయిదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే రాష్ట్రం గీతంగా ప్రకటించారు. ఈ రెండు చరణాల్లో తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనున్నది. జూన్‌2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్టాన్రికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది.