సర్కార్‌ స్కూళ్ల దివాళాకు కారణం ఎవరు?

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ దివాళా తీస్తున్నాయంటే కారణం ఎవరు? పాలకుల విధానాలు కారణంగా స్కూళ్లు బలపడకుండా బయట పడుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటు, కార్పొరేట్‌లను ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలన్న ప్రచారం ఊదరగొట్టినా, సౌకర్యాలు కల్పించినా ఎందుకనో తల్లిదండ్రలుకు నమ్మకం కుదరడం లేదు. తమ బతుకులు ఎలాగూ బాగుపడలేదని, కనీసం తమ పిల్లల బతుకలయినా బాగుపడాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అందుకే సర్కార్‌ స్కూళ్లకన్నా ప్రైవేట్‌ స్కూళ్లవైపే మొగ్గు చూపారు. మరోవైపే రేషనలైజేషన్‌ కారణంగా ఇంతకాంల ముంగిట ఉన్న స్కూళ్లు కడా మూతపడుతన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ప్రభుత్వ స్కూళ్లలో పంతుళ్లు సరిగా ఉండరని, చదువులు సాగవన్న భయాలు కూడా తల్లిదండ్రులను వెన్నాడుతున్నాయి. అందుకే ఎప్పటిలాగానే వేసవి సెలవుల తదుపరి బడి గంట మోగినా, ప్రైవేట్‌ గంటలే గట్టిగా వినబడ్డాయి. షరామామూలుగానే సర్కారీ స్కూళ్లను ఇబ్బందులు ముసురు కున్నాయి. పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ది కనిపించడం లేదు. నిజానికి సాంకేతిక పెరిగిన నేపథ్యంలో మారుమూల గ్రామంలో కూడా స్కూల్‌ చిత్రాలను, పిల్లల సంఖ్యను,సౌకర్యాలను తెలుసుకునే వీలుంది. జిల్లాలో అధికారులు ఎవరికి వారు ఈ డేటాను తయారు చేసివుంటే పాలకులకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునే వీలుండేది. కానీ అలా జరగడం లేదు. పిల్లలను బడి పాట పట్టించాలని కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ఆసక్తి కానరావడం లేదు. ఆకర్షణీయమైన పేర్లతో ప్రచార ఆర్భాటానికి పూనుకున్నారే తప్ప అసలు సమస్యలు గుర్తించడం లేదు. ప్రధానంగా స్కూళ్లకు వసతుల కరవు, బెంచీలు, కుర్చీలు,మరుగుదొడ్లు, టీచర్ల నియామకం, ఇంగ్లీష్‌ మాధ్యమం వంటి వాటిపై ఖచ్చితమైన ప్రణాళికతో పనిచేయడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, వంటషెడ్లు ఇత్యాది కనీస మౌలిక సదుపాయాల్లేని స్కూళ్లు వేలల్లో ఉన్నాయి. పైకప్పుల్లేని పాఠశాలలున్న వేళ ఆట స్థలాలు, ల్యాబ్‌లు, లైట్రరీల వంటి వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఇంతటి దయనీయ స్థితిలో ప్రభుత్వ బడులను పెట్టుకొని ఎన్ని ప్రకటనలు గుప్పించినా పేరెంట్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి ముందు వేసవి సెలవుల్లో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాల్సిన సర్కారు ఆ పని చేయకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు తయారు కావాలని ఆశిస్తున్న తీరు మంచిదే అయినా అందుకు అనుగుణంగా వేలాది పాఠశాలలు అస్సలు చదువుకోడానికి అనువుగా లేవు. ఆరుబయట, చెట్ల కింద నడుస్తున్న బడులు తరచూ విూడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఎలాగూ లేవు. కనీసం స్కూళ్లు తెరుచుకునే సమయానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలను సిద్ధం చేశారా అంటే అదీ లేదు. కావాల్సిన పాఠ్య పుస్తకాల్లో సగం ఇప్పటికీ బడులకు చేరలేదు. ఎప్పటికి వస్తాయో తెలీదు. పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేయకుండా ప్రతి స్కూల్‌లోనూ ఎదురుచూపులకు అవకాశం కల్పిస్తున్నారు. దీనికితోడు విూ బడిని బాగు చేయండని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు తమ స్కూళ్లకు కొంతయినా వెచ్చించాలని కోరుతున్నారు. నిజానికి ఇందులో తప్పులేదు. కానీ వారిచ్చే డబ్బుతోనే స్కూళ్లు నడవవు. మరమ్మతులకు, వెల్లలకు దాతలను వెతుక్కోవా లని టీచర్లకు సలహా ఇస్తోందంటే అంతకన్నా దారుణం మరొకటి లేదు.కార్పొరేట్‌ స్కూళ్లు నడుపుతున్న వారికి వంతపాడుతూ ప్రభుత్వ విద్యకు

ప్రాధాన్యతనిస్తున్నామని చెబితే జనం నమ్మవచ్చేమో గానీ క్షేత్రస్థాయిలో పిల్లలున్న తల్లిదండ్రులు

నమ్మాలి కదా. అందుకే తొలుత నామమాత్రపు ఫీజుతో ప్రైవేట్‌ స్కూళ్ల ప్రయాణం మొదలవుతోంది. పిల్లలు చేరాక మెల్లగా వసూళ్లు పెంచుతున్నారు. రకరకాలుగా పిండుతున్నారు. నొప్పి తెలియకుండా చూస్తున్నారు. వారి మాయాజాలంలో పడేలా చేస్తున్నారు. ఎల్‌కెజి, యుకెజి పిల్లలకు నగరాల్లో లక్షా రెండు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. చదువును కొన గలిగిన వారిని దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు నడుపుతున్నారు. గ్రామాల్లో పేద పిల్లలకు నేటికీ ప్రభుత్వ పాఠశాలలే దిక్కు. అయినా వారిని కూడా ఆకట్టుకునే చర్యలు కఠినంగా తీసుకోవడం లేదు. సర్కారు మౌలిక సదుపాయాలు కల్పించి ఆదుకుంటే తప్ప స్కూళ్ల బలోపేతం ఆశించలేదం. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ పెరగాలి. సరిపడ నిధులు ఖర్చు చేయాలి. ఆ పని చేయకుండా ఎన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల్లేని కారణంగా భారమైనప్పటికీ పేదలు ప్రైవేటు వైపు చూస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడు వేల పాఠశాలల్లో నీటి సౌకర్యం లేదు. టాయిలెట్లను శుభ్ర పరిచే పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసుకోవచ్చు. మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తోంది. వారికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. అందుకే ప్రభుత్వ తీరును అనుకూలంగా మార్చుకుంటున్న కార్పొరేట్లు ప్రజల నుంచి దోచుకుంటున్నాయి. తమ స్కూళ్లలోనే చేర్పించడని చేస్తున్న ప్రచారంతో గట్టెక్కుతున్నాయి. ప్రభుత్వాల విధానాల్లో మార్పు రాకుంటే సర్కార్‌ స్కూళ్లు మనగలగడం కష్టమే. ప్రభుత్వాలు కోరుకునేది కూడా ఇదే అయితే ఇక విద్యావ్యాపారం మరింతగా విస్తరించడం ఖాయం.