సహకారంతో అభివృద్ధి
మంత్రి కేటీఆర్
హైదరాబాద్,మే 29(జనంసాక్షి): హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకును మంత్రి కేటీఆర్ సందర్శించారు. సహకార బ్యాంకులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయమందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇతర బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. సహకార బ్యాంకు లతో అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన అన్నారు. సహకార సం థాల వల్లనే రైతులు బాగుపడ తారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సహకార సంఘాలు వెన్నెముఖలా వ్యవహరించాలన్నారు. సహకార సంఘాల వల్ల గ్రామీణ ప్రాంతాల రైతులకు మరింత మేలు చేకూరాలని, వీరికి అవసరమైతే తక్కువ ధరకే భూమిని ఇస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సహకార రంగంతోపాటు మార్కెటింగ్, వ్యవసాయానికి తమ ప్రభుత్వంలో ఒకే ప్రిన్సిపల్ సెఖ్రటరీ వుండటం వల్ల రైతులకు మరింత మేలు జరుగుతోందన్నారు. ముల్కనూరు సహకార సంఘం ప్రపంచంలోనే ఖ్యాతి గాంచిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ను అభివృద్ధి చేశానన్న చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. బాబు అతిగా ఊహించుకుంటున్నాడని, ఒక్క వ్యక్తివల్ల అది సాధ్యమయ్యే పని కాదని కొట్టిపారేశారు. బాబు పుట్టకముందే హైదరాబాద్ రాష్ట్రం మిగులు రాష్ట్రమని బాబు తెలుసుకోవాలన్నారు. బాబు అభివృద్ధి చేసి వుంటే ఇక్కడ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. అంతేకాక గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేబదులు ఆంధ్రకు ఎందుకు రావట్లేదో బాబు ఆలోచించుకోవాలన్నరు. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే నేతలు అటుఇటు మారుతున్నారని, దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు.