సాగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

 గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి) : జాన్ పహాడ్ పరిధిలోని మేజర్ 10వ నంబర్ కాలువలో మృతదేహం లభ్యం ఐన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గరిడేపల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ గ్రామ పంచాయతీ పరిధి గుండా వెళ్ళే జాన్ పహాడ్ మేజర్ 10 నంబర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వస్తుండగా కొందరు వ్యక్తులు ఆ మృతదేహాన్ని గమనించి బయటకు తీశారు. బయటకు తీసిన వెంటనే ఆ వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా తలకు బలమైన గాయం ఉండి రెండు చేతులు కట్టి వేసి ఉన్నాయి. మృతుడు బ్లూ కలర్ చొక్కా తో ఉన్నాడు . మృతుడి వివరాలు తెలిసిన వారు ఉంటే ఎస్ఐ కొండల్ రెడ్డి సెల్ నంబర్లను సంప్రదించాలని అన్నారు.