సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : కోమటిరెడ్డి చంద్రారెడ్డి

నల్గొండ, జనవరి 29 (): వచ్చే నెల 20, 21 తేదీల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి కోరారు. స్థానిక వర్తక సంఘంలో నిర్వహించిన రెండవ రోజు సిఐటియు డివిజన్‌ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సంబంధించిన చట్టాలను అమలు చేయకుండా ప్రపంచ బ్యాంకు ఒప్పందాలకు అమ్ముడుపోయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ అధ్యక్షులు పాండు, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.