సింగరేణి సమస్యలను సిఎం పరిష్కారిస్తారు: కార్మికుల ఆశాభావం
ఆదిలాబాద్,ఫిబ్రవరి17( (జనంసాక్షి) ): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో సిఎం కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని తెబొగకాసం నాయకులు అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిస్కారం అయ్యాయని అన్నారు. అందరి సహకారంతో ఏర్పడిన తెలంగాణలో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, సకల జనుల సమ్మె కాలపు అడ్వాన్సు చెల్లిస్తారనే నమ్మకంతో కార్మికులు ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోశించిన సింగరేణి కార్మికులు బంగారు తెలంగాణ కోసం భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొని సత్తా చాటారన్నారు. ఇదిలావుంటే సింగరేణి సంస్థలో పని చేస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసాయి. ఒప్పంద కార్మికుల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి. సింగరేణిలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నీరటి రాజన్న అన్నారు. వేతనాలు పెంచాలని ఒప్పంద కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించిక పోవడం సరికాదన్నారు. సింగరేణి ఓబీ డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులందరికీ జెబీసీసీఐని వర్తింప చేయాలన్నారు. హైపవర్ కమిటీ నిర్ణయించిన
వేతనాలను అమలు చేయాలన్నారు. 8గంటల పనిని, 26రోజుల పని దినాలను అమలు చేసి, అదనపు పనికి ఓటీ చెల్లించాలన్నారు. జాతీయ పండుగ, ఎర్న్డ్ లీవులను అమలు చేయాలని, ఓబీ కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి నెల మొదటి వారంలోనే బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, పేస్లిప్లు అందించాలన్నారు.