సీబీఐ,ఈడీల పదవీకాలం పొడగింపు


` ఐదేళ్ల వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం
` ఆర్డినెన్సులపై సంతకం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
దిల్లీ,నవంబరు 14(జనంసాక్షి):కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీ కాలం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్రం రెండు వేర్వేరు ఆర్డినెన్సులను తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ మేరకు ఆర్డినెన్సులపై సంతకం చేశారు. ప్రస్తుతం సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.తాజాగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల ప్రకారం.. రెండేళ్ల పదవీ కాలం పూర్తయ్యాక ఏడాది చొప్పున మొత్తం ఐదేళ్ల వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత పొడిగించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఈడీ డైరెక్టర్‌ ఎస్‌కే మిశ్ర పదవీకాలం పొడిగింపు విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ, అరుదైన సందర్భాల్లో మాత్రమే పదవీ కాలాన్ని పొడిగించాలని పేర్కొంది. వచ్చే వారం ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తికావొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్సులు తీసుకురావడం గమనార్హం.