సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో మీడియా సిబ్బంది ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.కోర్టు ప్రాంగణంలో అధికారిక వినియోగానికి మినహా, వీడియోగ్రఫీ, రీల్స్‌ చేయడానికి, ఫొటోలు తీయడం కోసం ఉపయోగించే ఫోన్స్‌, కెమెరా, ట్రైపాడ్‌, సెల్ఫీ స్టిక్‌ వంటి పరికరాలను న్యాయస్థానం నిషేధించింది.‘’ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై బార్‌ అసోసియేషన్‌ లేదా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తగిన చర్యలు తీసుకోవాలి. మీడియా సిబ్బంది, నిబంధనలను అతిక్రమిస్తే ఆ మీడియాకి నెల పాటు ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వవచ్చు. కోర్టు సిబ్బంది లేదా రిజిస్ట్రీ, సంబంధిత ఉన్నత అధికారులు ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తూ.. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’ అని సర్క్యులర్‌లో పేర్కొంది.హై సెక్యూరిటీ జోన్‌లో సిబ్బంది, న్యాయవాదులు లేదా ఇతరులు ఫొటోలు లేదా వీడియోలు తీయకుండా నిరోధించే హక్కు భద్రతా సిబ్బందికి ఉంటుందని జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.