సుష్మా జీ… ! జరపట్టించుకోండి
– విద్యార్థులపట్ల అమెరికా వైఖరిపై కేటీఆర్ లేఖ
హైదరాబాద్,జనవరి6: తెలుగు విద్యార్థులు అమెరికా ఎదువరవుతున్న ఇబ్బందులను పట్టించుకుని, వాటికి పరిష్కారం చూపాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలుగు విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి కె. తారకరామారావు కేంద్రాన్ని కోరారు. అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన, వెళ్తున్న విద్యార్థులు అమెరికాలో పలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా కూడా..అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని..ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. విద్యార్థులకు వీసా, అనుమతి పత్రాలున్నా, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. విద్యార్థులను వెనక్కి పంపుతుండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని కేటీఆర్ తెలిపారు. అమెరికా నుంచి కొందరు విద్యార్థులను, ఆ దేశానికి వెళ్తున్న మరికొందరు విద్యార్థులను పలు విమానాశ్రయాల నుంచి వెనక్కిపంపిన సంగతి తెలిసిందే. ఇది చాలా అవమానకరమని అన్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువమంది తెలుగు విద్యార్తులు వెళుతున్నారని అందువల్ల వారి తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారని అన్నారు. అవసరమైతే తాను విదేశాంగ మంత్రిని కలిసి పరిస్థితిని చర్చిస్తానని కెటిఆర్ అన్నారు.