సెక్యూరిటీ ట్రాకర్ల విడుదల
న్యూఢిల్లీ,నవంబరు19(జనం సాక్షి):వినియోగదారులకు చెందిన వస్తువులకు సెక్యూరిటీ అందించే పలు ట్రాకర్లను టైల్ అనే ఓ అంతర్జాతీయ కంపెనీ భారత్లో విడుదల చేసింది. టైల్ స్టిక్కర్, టైల్ స్లిమ్, టైల్ ప్రొ పేరిట మూడు రకాల ట్రాకర్లను ఆ కంపెనీ లాంచ్ చేసింది. వీటితో వినియోగదారులు తమ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వీటిని బ్యాగులు, సూట్కేసులు, వాలెట్లు, హ్యాండ్బ్యాగులు తదితర వస్తువుల్లో పెట్టుకుంటే.. ఆయా వస్తువులు పోయినప్పుడు వెంటనే వాటిల్లో ఉండే సదరు ట్రాకర్లు వినియోగదారుల స్మార్ట్ఫోన్లకు మెసేజ్లను పంపుతాయి. దీంతో యూజర్లు తమ వస్తువులను ఆ ట్రాకర్లతో సులభంగా ట్రాక్ చేసి తిరిగి వాటిని పొందేందుకు వీలుంటుంది. ఇక ఈ ట్రాకర్లు బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోన్కు కనెక్ట్ అవుతాయి. వీటికి వాటర్ ప్రూఫ్ ఫీచర్ను కూడా అందిస్తున్నారు. కాగా టైల్ స్టిక్కర్ ట్రాకర్ డబుల్ ప్యాక్ ధర రూ.3,999 ఉండగా, నాలుగు ట్రాకర్లను రూ.7,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక టైల్ స్లిమ్ ట్రాకర్ ధర రూ.2,999గా ఉంది. అలాగే టైల్ ప్రొ ట్రాకర్ను వినియోగదారులు రూ.3,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. వీటిని అమెజాన్ సైట్లో ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు.