స్టార్ క్యాంపెయినర్లు రాహుల్, సోనియా
– హిమాచల్ ప్రదేశ్లో పట్టునిలుపుకొనేలా కాంగ్రెస్ ప్రయత్నాలు
న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి) : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకుని మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారకర్తల జాబితాను విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించనున్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, హరీష్ రావత్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, రాజ్ బబ్బర్ తదితరులు హిమాచల్ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. నవంబర్ 9న జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆర్కి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు నదౌన్ నుంచి పోటీ చేయనున్నారు. 59 మంది సభ్యులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటంచింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీరభద్ర సింగ్ను రాహుల్ ప్రకటించారు. నామినేషన్ల పక్రియ ప్రారంభం కాగా, ఈనెల 23తో నామినేషన్ల దాఖలు గడవు ముగియనుంది.