స్నే‌హితుడి దారుణ హత్య… ఫ్రిజ్‌లో ముక్కలుగా శరీరభాగాలు

 న్యూఢిల్లీ: దక్షిణ సాకేత్ ప్రాంతంలోని ఒక బార్‌లోని పనిచేస్తున్న విపిన్ చంద్ జోషి (30) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని స్నేహితుడు, సహోద్యోగి అయి బాదల్ మండల్ ఇంటి రిఫ్రిజిరేటర్‌లో ముక్కలుముక్కలుగా విపిన్ జోషి మృతదేహం కనిపంచడంతో పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఈ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది.  పోలీసుల సమాచారం ప్రకారం గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్స్‌లో విపిన్, మండల్ బార్ టెండర్లుగా పనిచేస్తున్నారు. సైదులాజబ్ ప్రాంతంలో వేర్వేరు ఇళ్లలో వారు నివాసముంటున్నారు. గత సోమవారం రాత్రి ఇద్దరూ బార్‌లో పని ముగుంచుకుని మండల్ ఇంటికి వెళ్లారు. అక్మడ కలిసి మద్యం సేవించారు. గురువారంనాడు విపిన్ జోషి బంధువులు అతనికి ఫోన్ చేసి ఎంతకూ సమాధానం రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో సైదులాజబ్ ఏరియాలోని ఓ ఇంటి నుంచి భారీగా దుర్గంధం వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఇంట్లోనే మండల్ ఉంటున్నాడని, అతని ఇంట్లోంచే దుర్గంధం వస్తోందని గ్రహించిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. తలుపు మూయని ఫ్రిజ్ నుంచి ఆ వాసన వస్తోందని తెలిసింది. అందులో ముక్కలుముక్కలుగా విపిన్ జోషి శరీరభాగాలు కనిపించాయి. మండల్ పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపు ప్రారంభించారు. ఈ హత్యకు కారణం ఏమిటనేది తెలుసుకునేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు.