“స్వచ్ఛ గురుకుల” ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న

డి.ఎస్.పి. శ్రీనివాసులు
ఎల్లారెడ్డి:సెప్టెంబర్ 11 (జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాల ప్రాంగణ పరిశుభ్రతలో  పాఠశాల యాజమాన్యంతో పాటు స్థానిక ప్రజలను, ప్రజా ప్రతినిధులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసే సదుద్దేశంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకులాలో ఈ నెల 5 నుండి 11 వరకు వారం రోజులపాటు “స్వచ్ఛ గురుకుల” కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ఆదివారం  ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో నిర్వహించిన “స్వచ్ఛ గురుకుల” సమాపనోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణ డి.ఎస్.పి  శ్రీనివాసులు  విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ  విద్యార్థులు స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచాలని, స్వచ్ఛతను గురుకులాలకే పరిమితం చేయకుండా విద్యార్థులు సెలవుల్లో వారి ఇళ్లకు వెళ్లిన సందర్భంలో కూడా ఇంటి వద్ద  వారి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తద్వారా విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో మంచి విద్యను అభ్యసించడానికి ఆస్కారం ఉంటుందని, పేర్కొన్నారు. బీ.ఈ.డీ చదివిన తనకు విద్యార్థుల పట్ల విశేషమైన మమకారం ఉంటుందని. విద్యార్థుల భాగస్వామ్యం ఉన్న “స్వచ్ఛ గురుకుల  సమాపన ఉత్సవ” కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషకరమని “స్వచ్ఛ గురుకుల” కార్యక్రమాన్ని వారం రోజుల కార్యక్రమంగా కాకుండా నిర్విరామంగా నిర్వహించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి  తెలంగాణ పోలీస్ శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్  కృతా మూర్తి, బిచ్కుంద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్  ఎం. శ్రీనివాస్,మరియు ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.