హిందుత్వ తీవ్రవాదుల దుశ్చర్య

2

– ఇద్దరు ముస్లిం యువకుల దారుణ హత్య

రాంచి,మార్చి19(జనంసాక్షి):జార్ఖండ్‌ రాష్ట్రంలోని జబ్బార్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు పశువుల వ్యాపారులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి, వారి చేతులను వెనక్కి విరిచికట్టి ఓ చెట్టుకు ఉరితీశారు. వారి హత్యకు కారణాలు ఏమిటో పోలీసులు నేటికి కనుక్కోలేకపోయినా వారిని హిందుత్వవాదులే హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.హత్యకు గురైన వారు ఆజాద్‌ ఖాన్‌ అలియాస్‌ ఇబ్రహీం(15), ముహమ్మద్‌ మజ్లూం(35) అనే ముస్లిం యువకులు అవడం, గోవులను కబేళాలకు తరలిస్తున్నారని ఆ మధ్య ఇద్దరు వ్యక్తులను హిందుత్వ వాదులు కొట్టి చంపిన నేపథ్యంలో ఈ హత్యలు కూడా ఆ కోవకు చెందినవేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉరితీసిన చోట ఓ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి గొడవ చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులను అదుపు చేయడం కోసం పోలీసులు పలుసార్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇవి కచ్చితంగా హిందూ ర్యాడికల్స్‌ చేసిన హత్యలేనని జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (ప్రజాతాంత్రిక్‌) ఎమ్మెల్యే ప్రకాష్‌ రమాస్‌ ఆరోపించారు. ఎనిమిది ఎద్దులను సవిూపంలోని ఛాట్రా మార్కెట్‌కు తీసుకెళుతుండగా ఈ హత్యలు జరిగాయని, కొంతమంది గుంపు ముస్లిం యువకులను తీవ్రంగా కొట్టడం దూరం నుంచి చూశామంటూ కొందరు గ్రామస్థులు తెలిపారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎద్దులు ఏమయ్యాయో గ్రామస్థులు కూడా చెప్పలేక పోతున్నారని వారన్నారు. ఇప్పుడే హత్యలపై ఓ నిర్ణయానికి రాలేమని, హత్యలకు గురైన వారితో ఎవరికైనా వ్యక్తిగత కక్ష్యలు ఉన్నాయా? వ్యాపార లావాదేవీల గొడవులున్నాయా ? అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.