హెచ్ఎస్బీసీ ఇండియా సీఈవోగా జయంత్
న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి) : హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్(హెచ్ఎస్బీసీ) ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జయంత్ రిఖేయ్ నియమితులయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని హెచ్ఎస్బీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 1989లో హెచ్ఎస్బీసీలో చేరిన జయంత్ అంచెలంచెలుగా ఎదిగి సీఈవో స్థాయికి చేరుకున్నారు. దేశంలో హెచ్ఎస్బీసీని మరింత వృద్ధి దిశగా ఆయన తీసుకెళ్తారని బ్యాంకు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ, ఆసియా-పసిఫిక్ సహా 11 రీజియన్లకు జనరల్ మేనేజర్గా ఉన్నారు. స్టువర్ట్ మిల్నే స్థానంలో జయంత్ కొత్త బాధ్యతలు చేపడతారు. హెచ్ఎస్బీసీ ఉద్యోగ జీవితంలో ఆయన వివిధ దేశాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేశారు. కార్పొరేట్ బ్యాంకింగ్ ఇన్ తైవాన్, ఇనిస్ట్యూషనల్ ఫండ్ సర్వీసెస్ ఇన్ హాంకాంగ్, హెడ్ ఆఫ్ సెక్యురిటీస్ సర్వీసెస్ ఫర్ ద మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫిక్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర విభాగాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.