హైదరాబాద్‌ను హరితవనం చేద్దాం

2

– గవర్నర్‌కు మొక్కను బహుకరించిన మేయర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):హైదరాబాద్‌ ను కాలుష్యరహిత హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని కొత్తగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రాంమోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దిన్‌ లకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు.నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నేడు సాయంత్రం డిప్యూటి మేయర్‌ బాబా ఫసియోద్దీన్‌తో రాష్ట్ర గవర్నర్‌ను మేయర్‌ బొంతు రాంమోహన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పూలగుచ్చం కాకుండా మొక్కను మేయర్‌ బహుకరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కు వారు పూలగుచ్చం కాకుండా మొక్కను బహుకరించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గవర్నర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్యం నుండి పరిరక్షించి ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దడానికి హరితమయం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌ నగరానికి మొట్టమొదటి సారిగా యువకులు మేయర్‌, డిప్యూటి మేయర్‌గా ఉన్నారని, నగర అభివృద్దికి తమదైన శైలీతో పనిచేయాలని అన్నారు. హైదరాబాద్‌ నగర అభివృధ్దికి తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని గవర్నర్‌ నరసింహన్‌ మేయర్‌, డిప్యూటి మేయర్లకు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రాంమోహన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో చిత్తశుద్దితో పనిచేయగలమని గవర్నర్‌కు వివరించారు. నగరంలో మౌలిక పౌర సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, నగర అభివృద్దిలో తమ విలువైన సలహాలు, సూచనలు అందజేయాలని రాష్ట్ర గవర్నర్‌కు మేయర్‌ రాంమోహన్‌, డిప్యూటి మేయర్‌ బాబా ఫసియోద్దీన్‌లు విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌కి కొత్త మేయర్‌ వెరైటీ గిఫ్ట్‌!

సాధారణంగా పెద్ద ¬దాలో ఉన్న వ్యక్తులను కలిసేందుకు వెళ్లినప్పుడు వారికి గౌరవ సూచకంగా పుష్పగుచ్ఛాలు అందించడం పరిపాటే. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గా తాజాగా బాధ్యతలు చేపట్టిన బొంతు రామ్మోహన్‌ మాత్రం కాస్తా వెరైటీ కానుకను అందించారు. బోకేకు బదులు ఆయన ఓ చిన్ని మొక్కను గవర్నర్‌ నరసింహాన్‌కు అందించారు. ఆ చిన్ని మొక్కను ఆప్యాయంగా తీసుకున్న గవర్నర్‌ నరసింహన్‌ బొంతు రామ్మోహన్‌ను అభినందించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా బొంతు రామ్మోహన్‌, బాబా ఫసియుద్దీన్‌ శనివారం మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. వారిని అభినందించిన నరసింహన్‌ హైదరాబాద్‌ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, పచ్చని నగరంగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.