హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం

4

– సీఎం కేసీఆరత్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధుల భేటి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి):

క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులను కోరారు. హైదరాబాద్‌, ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎంను అడిగి కంపెనీల ప్రతినిధులు తెలుసుకున్నారు. రహదారులు, బ్రిడ్జిలు, సస్పెన్షన్‌ బ్రిడ్జిల నిర్మాణంలో పాలు పంచుకుంటామని ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఇక హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన స్టాట్రెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికను సీఎం ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం, మంచిర్యాల కార్పోరేషన్లలో అంతర్జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు శర వేగంగా విస్తరిస్తున్న నగరానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. ఇప్పటికే చేపట్టిన స్టాట్రెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంతో పాటు మూసీ నదిపై తూర్పు నుంచి పడమర వరకు 42 కిలోవిూటర్ల మేర ఆరు లైన్ల రహదారిని నిర్మించే ప్రణాళికను కూడా ఇన్‌ఫ్రా ప్రతినిధులకు సీఎం వివరించారు. వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌ తదితర హైవేలకు ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ హైవేలు నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. దుర్గం చెరువుపై కూడాసస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మించాలని యోచిస్తున్నామని సీఎం తెలిపారు.