హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్‌ కంపెనీ
` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు
` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్‌
` ముఖ్యమంత్రితో పరిశ్రమ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్‌(జనంసాక్షి) :తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలి లిల్లీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిన్‌ జాన్సన్‌, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెలో టుకర్‌, మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ఎలి లిల్లీ ముందుకొచ్చింది. రూ.9 వేల కోట్లతో ప్లాంటు క్వాలిటీ సెంటర్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థను సీఎం అభినందించారు.ఫార్మా పాలసీని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. జీనోమ్‌ వ్యాలీలో ఏటీసీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని.. అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని వెల్లడిరచారు. ఆనంద్‌ మహీంద్రా నేతృత్వంలో స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని.. ఫార్మాకు సంబంధించిన ప్రముఖులు ఆ యూనివర్శిటీ బోర్డు మెంబర్స్‌గా ఉన్నారని సీఎం వివరించారు. తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలిలిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్‌ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్‌ ఏర్పాటుకు ఒక బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.9000 కోట్లు భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఎలిలిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎలిలిల్లీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. సీఎంతో పాటు ఐటీ అండ్‌ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఎలిలిల్లీ సంస్థ ప్రెసిడెంట్‌ ప్యాట్రిక్‌ జాన్సన్‌, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్‌ విన్సెలో టుకర్‌, ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ కుమార్‌, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం ఎలిలిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్‌, క్వాలిటీ హబ్‌ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎలిలిల్లీ కాంట్రాక్‌ మాన్యుఫాక్షరింగ్‌ నెట్వర్క్‌ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్‌ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్‌ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్‌, మేనేజ్మెంట్‌ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన ఎలిలిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్‌ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది. ప్రధానంగా డయాబెటిస్‌, ఓబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్‌ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది.
ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్‌, బెంగుళూరులో ఎలిలిల్లీ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయి.హైదరాబాద్‌ లో ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలోనే గ్లోబల్‌ కెపాబులిటీ సెంటర్‌ను ప్రారంభించింది. విస్తరణలో భాగంగా ఎల్‌ లిల్లీ కంపెనీ బారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వ కారణమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇప్పటికే దేశంలోనే ఫార్మ హబ్గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. 1965లో ఇందిరా గాంధీ హైదరాబాద్‌కు ఐడీపీఎల్‌ తీసుకు వచ్చినప్పటి నుంచి ఫార్మా రంగం విస్తరించిందని అన్నారు. పేరొందిన దిగ్గజ ఫార్మా కంపెనీలుండటంతో 40 వాతం బల్క్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్‌ వ్యాలీలో ఏటీసీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్‌ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు.