10శాతం జీడీపీ వృద్ధి సవాల్‌తో కూడుకున్నది

– కేంద్రం నిర్మాణాత్మక సంస్కరణలకు ముగింపు ఉండదు

– లీడర్‌షిప్‌ సదస్సులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): 10శాతం జీడీపీ వృద్ధి సాధించడమనేది సవాల్‌తో కూడుకున్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. గురువారం ఆయన హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొని మాట్లాడారు. గత మూడేళ్లుగా జీడీపీ వృద్ధి 7-9శాతం ఉంటుంది. 10శాతం వృద్ధి సాధించడమనేది అతిపెద్ద సవాల్‌. ఇది ఒక్క దేశీయ పరిణామాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది’ అని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్మాణాత్మక సంస్కరణలకు ముగింపు ఉండదని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను వేర్వేరు పన్ను రేట్ల కింద తీసుకొచ్చాం, దీంతో పాటు పలు వస్తువులపై విధించిన పన్ను రేట్లను సవరించామని జైట్లీ తెలిపారు. భవిష్యత్‌లో పన్ను విధానాల్లో మార్పులు దేశ ఆదాయంపై ఆధారపడి ఉంటుందన్నారు. 12శాతం, 18శాతం పన్ను శ్లాబులను విలీనం చేసే సంకేతాలను జైట్లీ ఇచ్చారు. ప్రపంచంలో 5శాతం పన్ను రేట్లను ఇప్పటి వరకు ఏ దేశం అమలు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి.