కరీంనగర్‌, జూలై25(జనంసాక్షి):  జిల్లాలో ఖరీఫ్‌లో  రైతులకు అధికంగా లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నందున రైతులు వరి,పత్తి నాట్లు వేసుకుంటున్నందున పంట రుణాలు మంజూరుకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ, రెవెన్యూ బ్యాంకర్లు సమన్వయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,44,000 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి నాట్లు వేస్తారని అంచనకాగా ఇప్పటి వరకు సాధారణ విస్తీర్ణంలో 32శాతం  వరినాట్లు పూర్తయ్యాయని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు వరినాట్లు ముమ్మరంగా వేయనున్నందున లక్ష్యం మేర రుణాలు మంజూరుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఖరీఫ్‌లో జూలై మాసం వరకు 512కోట్ల పంట రుణం రైతులకు పంపిణీ చేయగా ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 715కోట్ల పంట రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. నేటి వరకు గత ఖరీఫ్‌ సీజన్‌ కన్నా 203కోట్ల రూపాయలు అధికంగా పంట రుణం మంజూరు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఖరీఫ్‌లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం రైతులకు ఇబ్బంది లేకుండా పంట రుణాల మంజూ రుకు చర్యలు తీసుకునేలా తగు ఆదేశాలు జారి చేసినట్లు ఆమె తెలిపారు. అదే విధంగా కౌలు రైతులకు నిర్దేశిత లక్ష్యం మేరకు సెప్టెంబర్‌ చివరిలోగా 20కోట్ల పంట రుణాలు అందచేసేందుకు ప్రణాళిక రూపొందించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ద్వారా 8549మంది కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు మంజూ రు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రుణ అర్హత కార్డుల జారీ చేసిన కౌలు రైతుల జాబితా బ్యాంకు బ్రాంచిలకు పంపించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 295మంది అర్హతకల కౌలు రైతులకు ఒక కోటి 16లక్షల మేర రుణం మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. పోయిన సంవత్సరం రుణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతులు తీసుకున్న రుణం తిరిగి చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవాలని ఆమె సూచించారు. రైతులు నుండి రుణ రికవరీకి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ తహసీల్దార్లు బ్యాంకర్లకు సహకరించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతులకు పంట రుణం మంజూరు పై జాయింట్‌ లెక్టర్‌ ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొంటున్నట్లు. ఇటీవలనే మొట్ట మొదటిసారిగా అన్ని బ్యాంకుల బ్రాంచ్‌ మేనేజర్లతో సమావేశంపై కౌలు రైతులకు రుణం మంజూరుపై సమాక్షించి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. రెవెన్యూ శాఖ గుర్తించిన కౌలు రైతులు కాకుండా బ్యాంకర్లు అర్హత గల కౌలు రైతులను గుర్తిస్తే రెవెన్యూ శాఖ ద్వారా రుణ అర్హత కార్డులు (ఎల్‌ఐసి) మంజూరు చేసి బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయనున్నట్లు దీనికి సంబంధించిన ఆదేశాలు సంబంధిత అధికారులకు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. పంట రుణం పొందిన రైతులు, రుణ అర్హత కార్డు కలగిన కౌలు రైతులు సకాలంలో రుణం చెల్లిస్తే 100శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌లో 1266 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 715కోట్ల పంట రుణాలు పంపిణీ చేసినట్లు , మిగతా 551కోట్ల రూపాయలు లక్ష్యం మేరకు పంపిణీ చేయడానికి బ్యాంర్లు సహకరించగలరని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సురేష్‌ రెడ్డి తెలిపారని కలెక్టర్‌ ఈ ప్రకటనలో తెలిపారు.