17న కానిస్టేబుళ్ల రాత పరీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని పోలిస్‌ శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగుల కోసం ఈ నెల 17న నిర్వహించే రాత పరీక్షకు జిల్లా పోలీస్‌ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ శాఖలో 242 సివిల్‌, 80 ఎఆర్‌,105 ఎపిఎస్‌పి, 90 మహిళా కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం 6,730 మంది రాత పరీక్ష రాయనున్నారు. వీరి కోసం ఆదిలాబాద్‌లో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ త్రిపార్టీ తెలిపారు. ప్రతి ప్రశ్నకు జవాబులు జాగ్రత్తగా రాయాలని, ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు రాస్తే మార్కుల్లో కోత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పోస్టుల భర్తీ విషయంలో మధ్యవర్తుల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు.