17న ఢిల్లీలో విద్యుత్‌ శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: ఢిల్లీలో ఈనెల 17న రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రుల సమావేశం జరగనుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరుపున తాను ఈ సమావేశానికి హజరవుతున్నానని తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎవరికీ కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రానికి ఇవ్వాలని కోరడంతోపాటు గ్యాస్‌ను కేటాయించాలని, కొత్త ప్రాజెక్టులకు బొగ్గు ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు విన్నవించనున్నట్లు వెల్లడించారు. విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌ను సక్రమంగా ఇవ్వని కారణంగా ప్రజెక్టుల సామర్థ్యంలో యాభై శాతానికి మంచి వాడుకోలేకపోతున్నామనే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్‌తో పాటు త్వరలోనే అదనంగా మరో 8వందల మెగావాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.