2019లో కాంగ్రెస్దే అధికారం
– దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్,జనవరి12(జనంసాక్షి): 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. దానిని మరచి వ్యాఖ్యానాలు చేసే వారిని ప్రజలే చూసుకుంటారని అన్నారు. మంగళవారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై నగర కాంగ్రెస్ పార్టీ నాయకులతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు.టీఆర్ఎస్ పార్టీది కుటుంబపాలన అని అభివర్ణించారు.పేదల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇచ్చిన హావిూలు అమలు చేయలేదని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తే అది వృధానే అని చెప్పారు. ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్కు టీఆర్ఎస్ చేసింది ఏవిూ లేదన్నారు. ఏదైనా అభివృద్ది జరిగిందటే అది కాంగ్రెస్ చలవేనని అన్నారు. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా సవాస్పైనా టీపీసీసీ చీఫ్ స్పందించారు. మంత్రి కేటీఆర్ ఓ బచ్చా అని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ100 సీట్లు గెలుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ అలా చెబితే తాము దేనికైనా సిద్ధమని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు.గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఓ వేళ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్పై స్పందించారు. శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ… సెటిలర్లను భయబ్రాంతులకు గురి చేసింది టీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. సెటిలర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది…. ఇకపై నిలబడుతుందని జానారెడ్డి హావిూ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోందని జానారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ప్రజలకు అధికార టీఆర్ఎస్ అరచేతిలో స్వర్గం చూపించిందని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఖైరతాబాద్లో దానం నాగేందర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ… బలహీన వర్గాలు అంటే ఎంపీ కవితకు చిన్నచూపు అని ఆరోపించారు. మేకప్ ప్యాకప్ అని పవర్ స్టార్ పవన్కల్యాణ్ను కవిత అవమానించారని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలో పవన్కల్యాణ్ సేవలు అవసరం అని దానం చెప్పారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.