22న భైంసా,ఖానాపూర్‌లో కెసిఆర్‌ సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం జరుగనుంది.

భైంసా పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి సవిూపంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌చే భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ బహిరంగసభకు విచ్చేయనున్నారు. దీనిని విజయవంతం చేయాలని ముథోల్‌ తెరాస అభ్యర్థి జి.విఠల్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తనతోపాటు పార్టీశ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయ న్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. నియోజకవర్గం నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేరోజు ఖానాపూర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇక్కడి అయ్యప్ప ఆలయం ఎదుట ఖాళీ స్థలంలో సభాప్రాంగణం ఏర్పాటు కోసం పరిసరాలు అనుకూలంగా ఉంటాయని స్థానికులు తెలపడంతో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆ స్థలాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, సెక్యూరిటీ డీఎస్పీ నర్సిరెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డిలు బహిరంగ సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌, బారికేడ్ల ఏర్పాట్లపై తెరాస నాయకులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.