చైనా మాజీ రైల్వే మంత్రికి శిక్షపై అసంతృప్తి

బీజింగ్‌: చైనా మాజీ రైల్వే మంత్రికి అవినీతి కేసులో శిక్ష విధించడంపై ఆ దేశ నెటిజన్లు, నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2003 నుండి 211 వరకు చైనా రైల్వే మంత్రిగా వ్యవహరించిన లియూ ఘిజూన్‌ 65 కోట్లు లంచాలు తీసుకున్నందున సోమవారం కోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే, శిక్ష అమలను రెండేళ్లు వాయిదా వేస్తున్నట్లు మెలికపెట్టింది. ఆర్థిక నేరాలలో మరణశిక్ష మినహాయించేలా న్యాయవ్యవస్థ నిర్ణయాలు ఉంటాయని చైనా వర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ లాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ కొ యిసిస్‌ అభిప్రాయపడ్డారు. ఇలా వెసులుబాటుతో కూడిన శిక్షపై పలువురు నెటిజన్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. లియూకు శిక్ష అమలును వాయిదా వేస్తూ వెలువడిన తీర్పు చైనా ప్రజలకు ఆశ్చర్యమేమీ కలిగించలేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి నేరాల విషయంలో చట్టం ముందు నిల్చున్న వారికి వెసులుబాటుతో కూడిన శిక్షలే పడ్డాయని ప్రభుత్వ ఆదీనంలో ఉన్న గ్లోబల్‌ టైమ్స్‌ మంగళవారం తన కధనంలో వ్యాఖ్యానించడం గమనార్హం.