పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవరకూ పోరు


టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవరకూ పోరు కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ‘సాగదీస్తే.. సాగనంపుతాం’ నినాదంతో టీ జేఏసీ శుక్రవారం జన చైతన్య యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 24 వరకు తెలంగాణ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తామని కోదండరామ్‌ తెలిపారు. 25న హైదరాబాద్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌, తాండూర్‌లో ఈ యాత్ర సాగింది. 2014 ఎన్నికలలోపు తెలంగాణ సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. యాత్ర ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ యాత్రలో జేఏసీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.