కన్నీటితో మండేలాకు తుది వీడ్కోలు పలుకుతున్న కును

కును: నెల్సన్‌ మండేలా అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామం కునులో జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ సహా పలువురు దేశాధినేతలు, సౌతాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్‌ జుమా, మండేలా భార్య గ్రాకా మాచెల్‌ హాజరయ్యారు. దాదాపు 4500మంది ముఖ్యులు మాత్రమే అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనే ఏర్పాటు చేశారు. సంప్రదాయం, అధికారిక లాంఛనాల కలబోతగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబసభ్యులతో పాటు పలువురు సన్నిహితులు
శనివారం రాత్రి జాగారం చేసి మండేలా జీవిత ఘట్టాలను పాటలు పాడుతూ, ముఖ్య సంఘటనలను స్మరించుకుంటూ గడిపినట్లు సమాచారం. మండేలా ఇంటి నుంచి సమాధి చేసే స్థలం వరకు నేవీ అధికారులు బారులు తీరారు. మండేలా అంత్యక్రియల కార్యక్రమాన్ని దేశప్రజలంతా చూసేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.