8న టీఆర్‌ఎస్‌లో చేరతా:డీఎస్‌

2
నిజామాబాద్‌,జులై4(జనంసాక్షి):

కాంగ్రెస్‌ పార్టీని వీడిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ ఈ నెల 8న తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు నిర్వర్తించానని.. ఏ పదవి ఆశించకుండా తెరాసలోకి వెళ్తున్నట్లు డీఎస్‌ నిజామాబాద్‌లోవిూడియాతో  చెప్పారు. తనతో రావాలని సహచరులు, అనుచరులను ఇబ్బంది పెట్టనని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని తెలిపారు. గాంధీభవన్‌లో చిత్రపటాలు తొలగించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. తన ఇంట్లో ఉన్న సోనియాగాంధీ ఫొటోను మాత్రం తొలగించనని డీఎస్‌ అన్నారు. గాంధీభవన్‌లో తన ఫోటోను తొలగించినందుకు తాను బాధపడటం లేదన్నారు. ఈనెల 8న తెలంగాణ భవన్‌లో జరుగబోయే చేరిక కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో తాను పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తాను ఏ పదవిని ఆశించడంలేదన్నారు. తన వెంట రమ్మని కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టడంలేదని పేర్కొన్నారు. అయితే తన వెంట వచ్చే వారి బాధ్యతను మాత్రం తాను తీసుకోబోతున్నట్టు వెల్లడించారు రాష్ట్రాభివృద్ధితోపాటు, నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.