ఫారెస్ట్‌ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్‌ ఎటాక్‌

 

 

 

 

 

నవంబర్ 12(జనంసాక్షి)కొల్లాపూర్: అడవులను నరికడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఫారెస్ట్‌ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆక్రమణదారులు చదును చేసిన సుమారు 15 ఎకరాల అటవీ ప్రాంతంలో కొత్తగా మళ్లీ మొక్కలు నాటారు. దాదాపు 500 మంది అటవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి కౌంటర్‌ ఇచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కంపార్ట్‌మెంట్‌ 425లోని వేలాది చెట్లను నరికి చదును చేస్తున్నారనే సమాచారం రావడంతో అటవీ అధికారులు అక్కడకు వెళ్లారు. అయితే చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 15 ఎకరాల్లోని చెట్లను నరికి చదును చేశారు. దీంతో చెట్లు నరికిన అదే ప్రాంతంలో మళ్లీ చెట్లను నాటాలని అటవీ అధికారులు నిర్ణయించున్నారు. దీనికోసం డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి సారథ్యంలో ఫారెస్ట్‌ యంత్రాంగం మొత్తం కదలివచ్చింది.

కొల్లాపూర్‌ అమ్రాబాద్‌ రేంజ్‌ పరిధిలోని దాదాపు 500 మంది అటవీ శాఖ సిబ్బంది భారీ వాహనాల్లో ఘటన జరిగిన ప్రాంతానికి తరలివెళ్లారు. ఆక్రమణదారులు చదును చేసిన 15 ఎకరాల్లో కొత్తగా మొక్కలను నాటారు. అడవులను ఎవరైనా ఆక్రమించినా, ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడి చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా డీఎఫ్‌వో హెచ్చరించారు.