DSPని నగ్నంగా ఊరేగించి.. రాళ్లతో కొట్టి చంపేశారు
జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్లో దారుణం జరిగింది. డిప్యూటీ సూపరింటిండెంట్ (డీఎస్పీ) ఆయూబ్ పండిట్ను అల్లరి మూక కొట్టిచంపేసింది. శ్రీనగర్ పాతబస్తీ నౌవ్హాట్టాలోని జామియా మసీద్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటక 12.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. జామియ మసీదు వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ ఆయూబ్ పండిట్.. అర్ధరాత్రి సమయంలో మసీదు నుంచి బయటకు వస్తున్న వారిని ఫొటోలు తీశాడని తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా ఆయూబ్ తన పిస్తోల్తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన మూక ముకుమ్మడిగా విరుచుకుపడి.. ఆయనపై దాడి చేసింది. ఆయనను చుట్టుముట్టి.. దుస్తులు విప్పేసి.. నగ్నంగా మార్చి రాళ్లతో కొట్టిచంపింది. జనాలు అధిక సంఖ్యలో ఉండటంతో ఆయనకు రక్షణగా ఉన్న గార్డులు సంఘటనస్థలం నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. పండిట్ది నౌవ్హాట్టాకు సమీపంలో ఉన్న ఖన్యార్ ప్రాంతమే. ఆయన జామియ మసీదు వద్ద చాలాసార్లు భద్రతాపరమైన విధులు నిర్వహించారు. మసీదుకు వచ్చే చాలామందికి ఆయన పరిచయమే. ఆయూబ్ పండిట్ మృతి జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ విచారం వ్యక్తం చేసింది.