సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 16 (జనం సాక్షి)సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. ఆదివారం నగరంలోని 22వ డివిజన్ పరిధి వాసవి కాలనీలో గల ఇన్నర్ వీల్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవాన్ని (నేషనల్ ప్రెస్ డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య, నేత్ర పరీక్ష మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(టి.ఎస్.జే.యు) వరంగల్ జిల్లా బాధ్యులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛకు, పరిధికి భంగం కలిగించే చర్యలు ఎవరూ చేపట్టకూడదని అన్నారు. అలాగే సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి సమాజాభివృద్ధికి ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని కోరారు. అనంతరం జర్నలిస్టులందరికీ నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, స్థానిక కార్పొరేటర్  బస్వరాజు కుమారస్వామి, మట్వాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ఏజే మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కోడిమాల శ్రీనివాసరావు, వరంగల్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం  అధ్యక్షుడు గజ్జె గోవర్ధన్, డా.దయాకర్ వైద్య బృందం, ఎంజీఎం బ్లడ్ బ్యాంకు సిబ్బంది, శరత్ ఐ హాస్పిటల్ సిబ్బంది మరియు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.