ప్రజలకు మరింత సేవ చేస్తా..!

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు నియామకం అయిన తర్వాత తొలిసారిగా మంథని నియోజక వర్గానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మంథని నియోజక వర్గం పొలిమేర గొల్లపల్లి వద్ద నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజ మాలలు వేసి శాలువాలు, పార్టీ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చేసిన సేవలను అధిష్టానం గుర్తించి రాష్ట్రస్థాయిలో తనకు కీలకమైన పార్టీ పదవిని ఇవ్వడం జరిగిందన్నారు. తన తండ్రి శ్రీపాద రావు ఆశ సాధన కోసం, తన అన్నయ్య మంత్రి శ్రీధర్ బాబు చూపిన బాటలో పయనిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకే కాకుండా పెద్దపెల్లి జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా అందరికీ మరింత సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ పదవి బాధ్యతలు అప్పగించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను క్లీన్ స్లీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రీను బాబు పిలుపునిచ్చారు.