ఛార్జీల మోత!
– కి.విూ రూ.20పైసలు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
– అర్థరాత్రి నుంచి అమల్లోకి
– ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం
– బస్ పాస్ ధరలకూ రెక్కలు
– పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు పెనుభారం
హైదరాబాద్, డిసెంబర్2(జనంసాక్షి) : నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల మోతమోగనుంది. బస్సు ఎక్కితే జేబులు గుల్ల కావాల్సిందే. ఇప్పటికే కి.విూ రూ. 20పైసలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొనడంతో.. సోమవారం ఆర్టీసీ యాజమాన్యం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల వారీగా ఆర్టీసీ ఛార్జీల పెంపును చేపట్టారు. ఛార్జీల పెంపు పేద, మధ్య తరగతి ప్రయాణీకులపై తీవ్రభారాన్ని మోపనుంది. పలు ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయించేది పేద, మధ్య తరగతి ప్రజలే. వీరిపై ఇప్పుడు ప్రభుత్వం భారం మోపింది. మరోవైపు విద్యార్థుల బస్పాస్లకు రెక్కలొచ్చాయి. పాస్ల ధరలను ఆర్టీసీ యాజమాన్యం భారీగా పెంచింది. కార్మికుల సమ్మెతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తెచ్చేందుకు చార్జీలను పెంచబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను, బస్పాస్ల ధరలను పెంచింది. దీని ప్రకారం ప్లలెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.10లకు(గతంలో రూ.8) పెంచారు. సెవిూ ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ రూ.10లు.. ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ రూ.15లు(గతంలో రూ.10), డీలక్స్ ఛార్జీ రూ.20లు(గతంలో రూ.15), సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25(గతంలో రూ.20).. రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీ రూ.35, గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీల్లో రూ.35లుగా నిర్ణయించారు. మరోవైపు బస్పాస్ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. సిటీ ఆర్టినరీ పాస్ ఛార్జీ రూ.950(గతంలో ర.770)కు.. మెట్రో పాస్ ఛార్జీ రూ.1070(గతంలో రూ.880)కు.. మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1180(గతంలో రూ.990)కు పెంచింది. అలాగే స్టూడెంట్ బస్పాస్ ధరను రూ.130 నుంచి రూ.165కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి కొత్త ఛార్జీలతో ప్రయాణికులపై భారీ మోత పడనుంది. మరోవైపు స్టూడెంట్ రూట్ పాస్(క్వార్టర్లీ) ఛార్జీ రూ. 130 నుంచి రూ. 165కి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైస్కూల్, కాలేజీ విద్యార్థులు తీసుకునే మఫిసిల్(క్వార్టర్లీ) పాస్ ఛార్జీని రూ. 235 నుంచి రూ. 310కి పెరిగాయి. హైస్కూల్, కాలేజీ విద్యార్థులు తీసుకునే మఫిసిల్(మంత్లీ) పాస్ ఛార్జీని రూ. 85 నుంచి రూ. 115కి పెరిగాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల పరిధిలో స్టూడెంట్ జనరల్ బస్ టికెట్(ఎస్జీబీటీ) ఛార్జీలను పెంచారు. ఎస్జీబీటీ(మంత్లీ) పాస్ ఛార్జీలను రూ. 130 నుంచి రూ. 165కు, ఎస్జీబీటీ(క్వార్టర్లీ) పాస్ ఛార్జీలను రూ. 390 నుంచి రూ. 495కి, ఎస్జీబీటీ స్పెషల్(మంత్లీ) పాస్ ఛార్జీలను రూ. 210 నుంచి రూ. 260కి, ఎస్జీబీటీ స్పెషల్(క్వార్టర్లీ) పాస్ ఛార్జీలను రూ. 630 నుంచి రూ. 780కి పెరిగాయి.