కేసీఆర్‌కు ఓయూలో విూటింగ్‌ పెట్టే దమ్ముందా

– తెలంగాణ నీ అయ్య జాగీరా

– ఉన్న సచివాలయానికి రాని నీకు కొత్త సచివాలయం ఎందుకు

– బైసన్‌పోలో గ్రౌండ్‌ జోలికొస్తే నిరసన దీక్ష చేస్తా

– రాజీవ్‌గాంధీ జయంతి అనంతరం దీక్షకు దిగుతా

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు

హైదరాబాద్‌, ఆగస్టు11(జ‌నం సాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఉస్మానియా క్యాంపస్‌లో విూటింగ్‌ పెట్టే దమ్ముందా అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథిని గౌరవించడం తెలంగాణ సంస్కృతి అని, కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుమారుడు రాష్ట్రానికి వస్తుంటే అవమానిస్తారా అంటూ వి.హెచ్‌. మండిపడ్డారు. ఓట్ల కోసమే బీసీలపై కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీ అయ్య జాగీరా కేసీఆర్‌ అంటూ వి.హెచ్‌ మండిపడ్డారు. 2019లో నిన్ను ఇంటికి పంపిస్తామంటూ హెచ్చరించారు. ఉన్న సచివాలయానికి రావు కానీ, స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ కావాల్సి వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. బైసన్‌ పోలో గ్రౌండ్‌ ఇస్తే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని, అవసరం అయితే ప్రాణం త్యాగానికి సిద్ధమని, ఆగస్టు 20న రాజీవ్‌ జయంతి తర్వాత దీక్ష చేస్తానని విహెచ్‌ ప్రటించారు. రాష్ట్రంలో తెరాస పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. కేవలం కవిూషన్లు వచ్చే ప్రాజెక్టులపైనే కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు దృష్టిసారించారని, తద్వారా రాష్ట్రాన్ని దోచుకొని కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ద్వారా తెరాస నేతలు కవిూషన్లు దండుకుంటున్నారని విహెచ్‌ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ పర్యటనను జయప్రదం చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలని వి.హెచ్‌ పిలుపునిచ్చారు.