తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ దీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌: డిసెంబర్‌ 28న అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయం చెప్పాలంటూ తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ జేఏసీ నేతల అధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ వాదులు దీక్ష శిబిరాల్లో నిరసనలు మొదలు పెట్టారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పాల్సిందేనని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

నల్లగొండ

నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు దీక్షలు ప్రారంభించారు. అఖిలపక్ష సమావేశంలో పార్టీలన్ని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ నల్లగొండ పట్టణం. సూర్యాపేట, భువనగిరి, నకిరేకల్‌లలో జేఏసీ దీక్షలు చేపట్టింది.

ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు మొదలయ్యాయి. నిర్మల్‌ పట్టణం ఆర్డీవో ఆఫీసు ముందు జేఏసీ ధర్నాలు చేపట్టింది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వారు దీక్షలు చేపట్టారు.

మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌లో జిల్లా వ్యాప్తంగా జేఏసీ దీక్షలు మొదలయ్యాయి. మల్దకల్‌తోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని డిమాండ్‌ చేస్తున్నారు.