ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి

సిరిసిల్ల, ఆగస్టు 11 (జనంసాక్షి) : నియోజక వర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల శాసన సభ్యులు కెటిఆర్‌ రెవెన్యూ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ల్యాండ్‌ అసైన్‌ మెంట్‌ కమిటి సమావేశానికి ఆయన ముఖ్య అతిదిగా హాజరయ్యారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరో విడత భూపంపిణీ కార్యక్రమంలో గంభీరావుపేట మండలంలో 33 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించగా 28 మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకు న్నారని, ఎల్లారెడ్డిపేట మండలంలో 125 ఎకరాలు గుర్తించగా 89 మంది దరఖాస్తు చేసుకున్నారని,ముస్తాబాద్‌ మండలంలో 57 ఎకరాలు గుర్తించగా 34 మంది దరఖాస్తు చేసుకున్నారని, సిరిసిల్ల మండలంలో ఎలాంటి భూములు గుర్తించలేదని తెలిపారు.మాజీ నక్సలైట్‌ ,గల్ప్‌ బాదితులు,కుల సంఘాలు ఈ భూ పంపిణీలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డివో సునంద,తహశీల్దార్లు జయచంద్రారెడ్డి,సుమా చౌదరి,పవన్‌ కుమార్‌,లు పాల్గొన్నారు.