రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి
న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ విజయమ్మ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ను కోరారు. ఎరువుల ధరలు పెరగడంతో పాటు విత్తనాలు దొరకక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆమె వివరించారు. గురువారంనాడు కృషి భవనంలో వైఎస్‌ విజయమ్మ, పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పవార్‌ను కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. మరోవైపు వైఎస్‌ విజయమ్మ, పవార్‌ భేటీని కవరేజ్‌ చేసేందుకు వెళ్లిన మీడియాను మంత్రి కార్యాలయ సిబ్బంది అడ్డుకుంది. తొలుత కవరేజ్‌ కోసం మీడియాకు అనుమతిచ్చారు. అయితే భేటీ సమయంలో అనుమతి లేదంటూ మీడియాను వెళ్లిపోమన్నారు. దీంతో పాత్రికేయులు అక్కడే ఆందోళనకు దిగారు. కార్యాలయ సిబ్బంది వైఖరిని మీడియా ప్రతినిధులు ప్రతిఘటించారు. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీసే విధంగా ఉండటంతో స్వ యంగా పవార్‌ వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. సర్దుకు పోవాలని మీడియాకు చెప్పి వెళ్లిపోయారు. పవార్‌ను కలిసిన వారిలో విజయమ్మతో పాటు శోభా నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోసులు కేంద్ర మంత్రి సుల్తాన్‌ అహ్మద్‌తో భేటీ అయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్ల సిబిఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తాము సుల్తాన్‌కు వివరించినట్లు మేకపాటి భేటీ అనంతరం చెప్పారు. తాము ఇచ్చిన వివరాలను మమతా బెనర్జీకి అందిస్తామని చెప్పారు. తృణమూల్‌ మద్దతు జగన్‌కు ఉంటుందని చెప్పారన్నారు. గత మూడు రోజులుగా విజయమ్మ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. బుదవారంనాడు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, ఎన్డీయే కన్వీనర్‌ శరద్‌ యాదవ్‌ను కలిసిన విజయమ్మ గురువారంనాడు వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు సివిసి ప్రదీప్‌ కుమార్‌ను కలవనున్నారు.