సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉత్పత్తి నిలిపివేశారు. గత నాలుగు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షంతో వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో రూ. 8 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. నీలం తుపాను రైతులను, కార్మికులను నిలువునా ముంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. సముద్రతీర ప్రాంతాలైతే తుపానుధాటికి విలవిల్లాడుతున్నాయి. నీటి ప్రవాహంతో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీలం తుపాను రాష్ట్రాన్ని తీవ్ర నష్టాలకు గురిచేసింది. దీంతో ప్రజల ఇబ్బందులు చెప్పనలవికాదు. ఎటు చూసినా నీళ్లే కనబడుతున్నాయి. చేతికందిన పంట నీటిపాలు కావడంతో రైతులు దు:ఖంలో మునిగిపోయారు. సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తుపాను బాధిత ప్రాంతాలను సర్వే చేయనున్నారు.